సాక్షి, రంగారెడ్డి జిల్లా: సీనియర్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి ముచ్చటగా మూడోసారి అమాత్యపదవిని దక్కించుకున్నారు. సీఎం కేసీఆర్ ఆమెకుఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఆదివారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో సబితకు చోటు లభించింది. కాంగ్రెస్కు దూరమై అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరిన ఆమె స్వల్పకాలంలోనే ప్రభుత్వంలో కీలక పదవిని దక్కించుకోవడం విశేషం. గతంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన సబితమ్మకు తాజాగా మరోసారి ఆ యోగం లభించింది. జిల్లాకు చెందిన పలువురు ఆయా పార్టీల నుంచి మంత్రులుగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ... మూడు పర్యాయాలు మంత్రిగా పనిచేసే అవకాశం కొందరికే లభించింది. ఈ జాబితాలో చేవెళ్ల చెల్లమ్మ ఒకరు.
మలుపు తిప్పిన నిర్ణయం..
టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుపొందిన కొండా విశ్వేశ్వర్రెడ్డి.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆయన జిల్లా కాంగ్రెస్ను శాసిస్తున్నారని, పార్టీ అధిష్టానం కూడా ఆయనకే ప్రాధాన్యం ఇచ్చిందని సబితా ఇంద్రారెడ్డి మనస్తాపం చెందారు. మరోపక్క పార్టీలో తనకు రోజురోజుకూ గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ టికెట్ను తన కుమారుడు కార్తీక్రెడ్డి ఆశించగా రాలేదు. ఈ పరిణామాలు కాంగ్రెస్కు ఆమెను దూరం చేయగా.. టీఆర్ఎస్కు చేరువ చేశాయి. ఈ క్రమంలో సబిత తన కుటుంబంతో కలిసి కేసీఆర్ను కలిశారు. ముఖ్యమంత్రి కార్తీక్రెడ్డి రాజకీయ భవిష్యత్కు భరోసా, సబితకు భవిష్యత్లో మంత్రి పదవిగా అవకాశం
కల్పిచేందుకు హామీ
ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్ఎస్ఎల్పీలో విలీనమవగా ఆ పార్టీలోని ఎమ్మెల్యేల్లో సబిత ఒకరు.
అభివృద్ధికి అవకాశం
మంత్రివర్గ విస్తరణలో సబిత రూపంలో మరోసారి ఉమ్మడి జిల్లాకు ప్రాతినిథ్యం దక్కడం శుభపరిణామం. 2004లో తొలిసారిగా వైఎస్సార్ హయాంలో సబిత గనులశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రాగానే హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. రెండు దఫాలుగా విజయవంతంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.