జంక్షన్‌ జామ్స్‌పై నజర్‌!

18 Nov, 2023 07:44 IST|Sakshi

హైదరాబాద్: నగర రహదారుల్లోని అనేక జంక్షన్లు ట్రాఫిక్‌ జామ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నా...వీటి వద్ద ఇబ్బందులు తప్పట్లేదు. ఈ అంశంపై దృష్టి పెట్టిన సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ జి.సుధీర్‌బాబు కొన్నింటి వద్ద ఇంజినీరింగ్‌ లోపాలకు బదులు సమన్వయ లేమి ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తొలి దశలో మూడు కీలక జంక్షన్లకు సంబంధించిన పరిధులు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పీక్‌ అవర్స్‌గా పిలిచే రద్దీ వేళల్లో ట్రాఫిక్‌ జామ్స్‌ చోటు చేసుకుంటున్న వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

మాసబ్‌ట్యాంక్‌ రోడ్డు సీన్‌ మార్చేలా...
లక్డీకాపూల్‌ వంతెనకు, మహావీర్‌ ఆస్పత్రికి మధ్య ఉన్న పీటీఐ జంక్షన్‌ సెంట్రల్‌ జోన్‌లోని సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పీఎస్‌లో ఉండేది. రద్దీ వేళల్లో లక్డీకాపూల్‌ వైపు నుంచి బంజారాహిల్స్‌, మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనాలు ఈ మార్గాన్నే అనుసరిస్తాయి. ఈ జంక్షన్‌్‌ తర్వాత ఉన్న మాసబ్‌ట్యాంక్‌ చౌరస్తా సౌత్‌ వెస్ట్‌ జోనన్‌లోని ఆసిఫ్‌నగర్‌ ట్రాఫిక్‌ ఠాణాలో ఉంది. దీంతో ఈ పోలీసులు మాసబ్‌ట్యాంక్‌ చౌరస్తా కేంద్రంగా తమ ఏరియాల్లో ఉన్న వాహనాలనే బయటకు పంపడానికి ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళు. పీటీఐ జంక్షనన్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ కన్నా మల్లేపల్లి, మెహదీపట్నం, బంజారాహిల్స్‌ వైపుల నుంచి వచ్చే వాటిపై దృష్టి పెడుతూ ఎన్‌ఎండీసీ, మెహదీపట్నం రూట్లలో ట్రాఫిక్‌ క్లియర్‌ చేసుకునే వాళ్ళు.

ఫలితంగా మాసబ్‌ట్యాంక్‌ చౌరస్తా–పీటీఐ చౌరస్తా మధ్య మార్గంలో భారీ ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడి ఆ ప్రభావం లక్డీకాపూల్‌ బ్రిడ్జ్‌ వరకు ఉండేది. ఈ కారణంగా నిలోఫర్‌, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రులకు వెళ్లే రోగులకు సైతం ఇబ్బందులు తప్పేవి కాదు. దీన్ని గమనించిన ట్రాఫిక్‌ పోలీసుల పీటీఐ చౌరస్తాను సైతం ఆసిఫ్‌నగర్‌ ఠాణాలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఉండే ట్రాఫిక్‌ సిబ్బందికి అటు సైఫాబాద్‌, ఇటు ఆసిఫ్‌నగర్‌ చానల్స్‌లో ఉన్న రెండు మ్యానన్‌్‌ ప్యాక్స్‌ అందజేశారు. మాసబ్‌ట్యాంక్‌ చౌరస్తాలోనూ రాంగ్‌ రూట్‌ తదితర ఉల్లంఘనలకు అవకాశం లేకుండా అనేక మార్పుచేర్పులు చేశారు. కొత్తగా బారికేడ్లు, బొల్లార్డ్స్‌ తదితరాలు ఏర్పాటు చేశారు.

ఈ రెండింటి పరిధి మార్చారు...
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1లో ఉన్న కీలక చౌరస్తాల్లో 1/12 జంక్షన్‌ ఒకటి. ఇది ఒకప్పుడు ఆసిఫ్‌నగర్‌ ట్రాఫిక్‌ ఠాణా పరిధిలో ఉండేది. దీంతో ఈ అధికారులు బంజారాహిల్స్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను తక్కువగా, మాసబ్‌ట్యాంక్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఎక్కువగా తీసుకునే వారు. దీని ప్రభావం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1 మొత్తం మీద ఉండేది. ఒక్కోసారి తాజ్‌ కృష్ణ, జీవీకే, ఎన్‌ఎఫ్‌సీ చౌరస్తాల వరకు ట్రాఫిక్‌ జామ్స్‌ ఉండేది. దీంతో ఉన్నతాధికారులు ఆసిఫ్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీసుల నుంచి ఈ చౌరస్తాను బంజారాహిల్స్‌ ఠాణాలో కలిపారు. అలాగే విశ్వేశ్వరాయ విగ్రహం ఉన్న ఖైరతాబాద్‌ జంక్షనన్‌్‌ పంజగుట్ట ఠాణాలో ఉండేది.

పంజగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు తమ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్‌ను బయటకు పంపడానికి ఇచ్చే ప్రాధాన్యం సైఫాబాద్‌, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ల వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను తీసుకోవడానికి ఇచ్చేవారు కాదు. దీంతో నిరంకారి, షాదాన్‌ కాలేజ్‌ సహా అనేక చోట్ల ట్రాఫిక్‌ జామ్స్‌ ఉండేవి. ఇది గమనించిన అధికారులు ఈ జంక్షనన్‌ను సైఫాబాద్‌ ఠాణాకు అప్పగించడంతో సమస్య కొంత వరకు పరిష్కారమైంది. ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ మధ్యలో ఓ కానిస్టేబుల్‌ ఉండి ట్రాఫిక్‌పై జంక్షన్‌లోని వారికి సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అలాగే బేగంపేట ప్రాంతం వెస్ట్‌జోన్‌ పరిధిలో ఉండగా...దీన్ని పూర్తిగా నార్త్‌జోన్‌ లోకి కలిపారు.

మరిన్ని వార్తలు