‘బాబు మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

19 Jan, 2019 13:45 IST|Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఏపీకి ప్రత్యేక హోదాపై గతంలో ఎగతాళి, ఎద్దేవా చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తున్నవేళ మరో వేషానికి సిద్దమవుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. దివంగత నేత ఎన్టీఆర్‌ విగ్రహం ముందు చంద్రబాబు ఫోటో చూస్తే.. గాంధీ ముందు గాడ్సే నిలబడ్డట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు అవలంభిస్తున్న విధానాలపైన నిప్పులు చెరిగారు.

తెలంగాణ ప్రాజెక్టులపై ప్రశ్నించాం
‘హరికృష్ణ పార్థీవ దేహం వద్ద చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో రాజకీయాలు మాట్లాడారు. కానీ అందరికీ తెలిసేలా కేటీఆర్‌ మా పార్టీ అధ్యక్షుడు ఇంటికి వచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏపీలో పోటీ చేయదు అయినా ఆ పార్టీని బూచిగా చూపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. చంద్రబాబుకు ప్రజలపై మమకారం లేదు, కేవలం ద్వేషం మాత్రమే ఉంది. హామీ లేకుండా ఆ రోజు దివంగత నేత వైఎస్సార్‌ ఎన్నికలకు వెళ్లారు. కానీ చంద్రబాబు ఓట్ల పండుగకు ముందు వృద్దులకు పింఛన్లు పెంచుతున్నారు. తెలంగాణ ప్రాజెక్టులు కడుతుంటే మా పార్టీ నిరసన తెలిపింది, ప్రశ్నించింది. 

వైఎస్సార్‌ సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
2014లో బీజేపీ ఆహ్వానం ఉన్నా మా పార్టీ వెళ్లలేదు. రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్‌తోను వెళ్లలేదు. 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ బలంగా ఉంది. రాష్ట్రంలో లేని ప్రత్యర్థులను సృష్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. పార్టీలను కొనే స్థాయికి చంద్రబాబు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి. దేశంలో ఏపీ కేంద్రబిందువుగా, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా వైఎస్సార్‌ సీపీ పోరాడుతుంది।అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి వివరించారు.  

మరిన్ని వార్తలు