అన్ని సర్వేల్లో టీఆర్‌ఎస్‌కు 16 సీట్లు: కేటీఆర్‌

8 Mar, 2019 18:04 IST|Sakshi

హైదరాబాద్‌: అత్యధిక స్థాయిలో ఓటర్లు ఉన్న పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్‌గిరి అని, ఇక్కడ ప్రాంతాల వారీగా కులాల వారీగా వివక్షకు తావులేదని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పధకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లికి మేనమామలా కేసీఆర్‌ సాయం చేస్తున్నారని అన్నారు. మనం చేపట్టిన రైతు బంధు పధకాన్ని కొన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టాయని గుర్తు చేశారు. దేశం మొత్తం తెలంగాణా పరిపాలనను గమనిస్తోందని వ్యాక్యానించారు. ఒక ఉద్యమ కారుడు, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్‌గా ఉండటం చాలా గొప్ప విషయమని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, కేసీఆర్‌ని పొడిగిన విషయం గురించి మళ్లీ గుర్తు చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రలు అదుపులో ఉన్నాయని, సీఎం కేసీఆర్‌ మీద నమ్మకంతో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు మనకు వేసి మరోసారి పట్టం కట్టారని అన్నారు. రాహుల్‌ కాకపోతే మోదీ..వీళ్లే నాయకులు..వేరే వారు లేరా.. బడితే ఉన్నోడిదే బర్రె అన్నట్లు ఉంటది ఢిల్లీలో కాంగ్రెస్‌ నాయకుల పరిస్థితి అని ఎద్దేవా చేశారు. మోదీ చేసింది చెప్పడానికేమీ లేదన్నారు. మహిళలు పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బులను డీమానిటైజేషన్‌ పేరుతో ఎత్తుకుపోయిండని విమర్శించారు. అన్ని సర్వేల్లో టీఆర్‌ఎస్‌ 16 సీట్లు గెలుస్తోందని చెబుతున్నాయని తెలిపారు.

ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ఆ రెండు జాతీయ పార్టీలకు గెలిచే అవకాశాలు తక్కువన్నారు. మనం పదహారు సీట్లు సాధిస్తే కేంద్రం మెడలు వంచి మనకు కావాల్సిన నిధులను తీసుకురావచ్చని వ్యాఖ్యానించారు. మిషన్‌ కాకతీయ, మిషన్ భగీరధకు కలిపి రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్‌ సిఫార్సు చేసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. మన పోటీ ఎవరితోనూ కాదని మనకు మనమే పోటీ అని అన్నారు.

కాంగ్రెస్‌పార్టీ దివాళా పార్టీ: మల్లారెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ దివాళాకోరు పార్టీ అని టీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గమని, అన్ని నియోజకవర్గాల కంటే అత్యదిక మెజారిటీని ఇక్కడ నుంచి అందిస్తామని చెప్పారు. కేటీఆర్‌ లాంటి యువ నాయకుడు మనకు ఉండటం మన అదృష్టమన్నారు. వేరే పార్టీలకు ఓటు అడిగే హక్కే లేదన్నారు. ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్‌ నాయకులు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. 

రూ.4 వేల కోట్లతో దాహార్తి తీర్చిండు: తలసాని
హైదరాబాద్‌ శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో బాధపడుతుంటే రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి వారి దాహార్తిని కేటీఆర్‌ తీర్చారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ గుర్తు చేశారు. కేటీఆర్‌ తన రోడ్‌షో ద్వారా బల్దియాలో 99 సీట్లను గెలిపించాడని, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేటీఆర్‌ ఒక్కరే తన రోడ్‌షో ద్వారా గ్రేటర్‌లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు సాధించి పెట్టారని కొనియాడారు.

మరిన్ని వార్తలు