ఢిల్లీ టూర్లతో సాధించిందేమిటి..?

3 Apr, 2018 09:21 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న వెన్నపుసగోపాల్‌రెడ్డి

చంద్రబాబుపై ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజం

అనంతపురం : వారినికోసారి ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు... తన పర్యటనలతో ఏమి సాధించారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రంలో పరిపాలనను గాలికొదిలేసి ఢిల్లీ పాలకులకు శాలువాలు, లడ్డూలను పంచుకుంటూ వారికి వంగి వంగి నమస్కారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షస క్రీడ, రాక్షస పాలన సాగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని పట్టుబట్టి అహర్నిశలు కష్టపడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి రోజుకో నాటకం, పూటకో మాట మాట్లాడుకుంటూ దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని బహిరంగంగా సోము వీర్రాజు, విష్ణుకుమార్, పవన్‌కళ్యాణ్‌లు ఆరోపిస్తుంటే కనీసం ఖండించలేని దుస్థితిలో ఈప్రభుత్వం ఉందన్నారు. చంద్రబాబు అసమర్థ పాలన వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సామాన్య ప్రజలు బతకడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులను చందాలడగడం సిగ్గుచేటన్నారు. పోలవరంలో జరిగినంత అవినీతి మరేదాంట్లో జరగలేదన్నారు.  సమావేశంలో వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు