రాజ్యసభలో హోదాకోసం నినదించిన విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో సోమవారం ఆందోళన నిర్వహించింది. సభ ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి ప్లకార్డు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం సభ ప్రారంభమైన తరువాత రాజ్యసభలో విజయసాయిరెడ్డి తన స్థానంలో నిలబడి ప్రత్యేక హోదా కోసం నినదించారు.
అయితే విపక్షాల ఆందోళన నేపథ్యంలో సభ కొద్దిసేపటికే మధ్యాహ్నానికి వాయిదాపడింది. తిరిగి 2 గంటలకు సభ ప్రారంభమైనప్పటికీ విపక్షాల ఆందోళన కొనసాగడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ సభను బుధవారానికి వాయిదావేశారు. కాగా, పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు విలువలు లేవనడానికి నిన్నటి స్టేట్మెంట్ ఒక నిదర్శనమన్నారు. కేసీఆర్ను మిడిల్ మోదీ అని, వైఎస్ జగన్ను జూనియర్ మోదీ అని అనడం ఆయన మానసిక స్థితికి నిదర్శనమని, నాలుగేళ్లు చంద్రబాబు.. మోదీతో చేసింది కాపురమా? వ్యభిచారమా? మీరొక వ్యభిచారా అని నిలదీశారు.