సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద ప్రకటించిన హామీలో భాగంగా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిపై రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సంధించిన ప్రశ్నకు కేంద్ర మానవవనరుల అభివృద్ది శాఖ నుంచి సమాధానం లభించింది. 2018-19లో క్యాంపస్ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడానికి పది కోట్ల రూపాయల గ్రాంట్ను మంజూరు చేసినట్లు తెలిపారు.
2015 జూలైలో వర్శిటీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని, విజయనగరం జిల్లాలోని రెల్లి గ్రామంలో 525 ఎకరాలను క్యాంపస్ కోసం కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం మధ్య ప్రదేశ్లోని అమర్కంటక్లో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని, దీని కోసం సెంట్రల్ యూనివర్సిటీల చట్టాన్ని సవరిస్తూ పార్లమెంట్లో వేరుగా బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.