అందరికీ ఒకేరోజు కల వచ్చిందా ఏంటి?

20 Dec, 2019 13:06 IST|Sakshi

ట్విటర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు

సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలపై ఆయన ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అమరావతిలో రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టు, ఇంకా ఏదయినా ప్రకటనకు ముందే తన వాళ్లకు సమాచారం ఇచ్చి చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగుకు పాల్పడ్డారు. అది ఆయన పేటెంట్. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని రావడం ఇష్టం లేని దత్తపుత్రుడు, పచ్చపార్టీ నేతలు వైఎస్సార్‌ సీపీపై నిందలు వేస్తున్నారు’ అని మండిపడ్డారు.

‘రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న వారంతా... అమరావతిని అధికారికంగా ప్రకటించకముందే చంద్రబాబు నాయుడు బంధువులు, బినామీలు, పచ్చ మాఫియా వేల ఎకరాలు ఎలా కొన్నారో అర్థం చేసుకోవాలి. రాజధాని వస్తుందని అందరికీ ఒకే రోజు కల వచ్చిందా’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే విధంగా రాజధాని అంశంపై ఎంపీ సుజనా చౌదరి వ్యవహార శైలిపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు... ‘ రాష్ట్రాల రాజధానుల ఎంపిక కేంద్రం పరిధిలో ఉండదని చట్టసభల సభ్యులందరికీ తెలుసు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కూడా ఈ విషయం స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కోవర్టు సుజనా చౌదరి మాత్రం కేంద్రం చూస్తూ ఊరుకోదని బట్టలు చింపుకుంటున్నాడు. అసలు విషయమేమిటంటే అమరావతిలో ఆయన భూములున్నాయి’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.(3 రాజధానులు: జీవీఎల్‌ కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు