కేసీఆర్‌పై గద్దర్, కేటీఆర్‌పై విమలక్క పోటీ

13 Sep, 2018 11:40 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య

ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య  

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తుగా కేసీఆర్‌ కొనితెచ్చుకున్న ఎన్నికల్లో కేసీఆర్‌పై గద్దర్, కేటీఆర్‌పై విమలక్క పోటీ చేయనున్నారని టీమాస్‌ ఫోరం ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గద్దర్, విమలక్కలు మాత్రమే తెలంగాణ వారసులని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం వీరిద్దరూ ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. గద్దర్‌ రాష్ట్రం కోసం పోరాడుతుంటే అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిపిందని.. ఆయనకు 6 బుల్లెట్‌లు తగిలాయని, విమలక్క కాలుకు గజ్జె కట్టి రాష్ట్రం కోసం ఆడీపాడారని చెప్పారు.

ఏ త్యాగం చేయని కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారని విమర్శించారు. గద్దర్, విమలక్కలను గెలిపించేందుకు ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు కృషి చేయాలన్నారు. వారిపై పోటీ పెట్టకుండా కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల వారు సహకరించాలని కోరారు. పోటీ పెట్టవద్దని రాహుల్‌ గాంధీ, కుంతియా, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలకు వినతిపత్రం సమర్పించనున్నట్లు ఐలయ్య స్పష్టం చేశారు. సమావేశంలో టీమాస్‌ ఫోరం కన్వీనర్‌ జాన్‌వెస్లీ, నాయకులు హిమబిందు, రేఖ ముక్తాల, మన్నారం నాగరాజు, శ్రీరాం నాయక్,ప్రొఫెసర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు