బాబుకు ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదు

5 Sep, 2018 11:34 IST|Sakshi
ఆళ్ల నాని(పాత చిత్రం)

ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిన్న(మంగళవారం) వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ ఎలీజాను అరెస్ట్‌ చేసి సుమారు 6 గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్‌లు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. పర్యటనల పేరుతో ముఖ్యమంత్రి ప్రతిపక్షాలు, రైతు సంఘం నేతలను అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు. తాను చేసిన తప్పులను ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు ఎక్కడ పర్యటన చేసినా అక్కడ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

తాను చేసిన మోసాలు, అక్రమాలకు చంద్రబాబుకు ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని విమర్శించారు. నీచ రాజకీయాలతో ఎన్ని కుయుక్తులు చేసినా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు. ఐఆర్‌ఎస్‌ అధికారిగా 30 ఏళ్ల పాటు పనిచేసిన ఎలీజా లాంటి నేతలను అరెస్ట్‌ చేసి మంచినీరు, ఆహారం కూడా ఇ‍వ్వకుండా ఆరు గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్‌, ఎలీజా సమక్షంలో లింగపాలెం మండలం రాయుడు పాలెంలో సుమారు 200 మంది టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

>
మరిన్ని వార్తలు