దుర్గారావుది మరణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్య

25 Jul, 2018 15:28 IST|Sakshi

సాక్షి, కర్నూలు : చంద్రబాబు మోసానికి, ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్‌ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదాలు అని ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే ఐజయ్య, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, హఫీజ్‌ ఖాన్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు తొత్తులుగా మారిన పోలీసులు పచ్చ చొక్కాలేసుకొని హోదా ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

ప్రజల సంకల్పం ముందు బాబు కుట్రలు, ఖాకీల కర్కశత్వం తుడిచిపెట్టుకు పోయాయని విమర్శించారు. బంద్‌లో పాల్గొని గుండెపోటుతో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త దుర్గారావు కుంటుంబానికి సానుభూతిని తెలిపారు. హోదా పోరులో వైఎస్సార్‌సీపీ సైనికుడు అశువులు బాయటం బాధాకరమని పేర్కొన్నారు. దుర్గారావుది మరణం కాదని చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. ఒక్క రోజు బంద్‌కు పిలుపు నిస్తే అదేదో నేరం అన్నట్లు, ప్రజలు దేశ ద్రోహులు అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ చేట్టిన బంద్‌ను ప్రభుత్వం విఫలం చేయలేదని ప్రజలే భగ్నం చేశారని డిప్యూటి సీఎం కేఈ క్రిష్ణమూర్తి అనడం సిగ్గుచేటన్నారు. ఒక్కరోజు బంద్‌తో హోదా వస్తుందా అన్న కేఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని విమర్శించారు. హోదా పోరాటంలో యూటర్న్‌ తీసుకుంది చంద్రబాబేనని ఆరోపించారు. నమ్మక ద్రోహం చేసి ఫిరాయించిన మంత్రులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఫిరాయింపుతో వచ్చిన మంత్రి పదవి శాశ్వతం కాదని అఖిలప్రియ తెలుసుకోవాన్నారు. ప్రత్యేక హోదా బంద్‌తో ఎవరు ఎటువైపో తేలిపోయిందన్నారు. ధ్వంద ప్రమాణాల రాజకీయ పార్టీల నైజం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. హోదా కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు