వాళ్లకు మా పార్టీలో చేరే అర్హత లేదు : వైవీ సుబ్బారెడ్డి

13 Jan, 2019 17:14 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : ఫిరాయింపు ఎమ్మెల్యేలు మళ్లీ పార్టీలోకి వస్తానంటే తీసుకోమని, వారికి ఆ అర్హత లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ చేపడితే సీఎం చంద్రబాబుకు భయమెందుకని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే ఈ కేసులో ఆయనతో పాటు పలువురి ప్రముఖుల పాత్ర ఉన్నట్లు అర్థమవుతుందన్నారు.  ఇప్పటికైనా హైకోర్టు మంచి నిర్ణయం తీసుకుందని, న్యాయం జరుగుతుందనే నమ్మకం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర పెద్దల ప్రోద్భలంతోనే ఈ హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. సరిగ్గా ఎన్నికల ముందు పెన్షన్లు పెంచడం రాజకీయమేనని మండిపడ్డారు. చంద్రబాబు చిత్తశుద్ధితో అమలు చేస్తారనే నమ్మకం లేదన్నారు. మాజీ కేంద్రమంత్రి పురేందశ్వరి పార్టీలోకి వచ్చే విషయం తనకు తెలియదని, వస్తే మాత్రం ఆహ్వానిస్తామన్నారు. సంక్రాంతిలోపు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లిస్తానని సీఎం చంద్రబాబు చెప్పారని, కానీ పనులు ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయితే వెలిగొండ ప్రాజెక్ట్‌ను ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.

సుబ్బారెడ్డిని కలిసిన బ్రెజిల్‌ బృందం
గేదెల వృద్ధి, పాల వృద్ధికి బ్రెజిల్‌ టెక్నాలజీ అందించాలని గతంలో బ్రెజిల్‌ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రభుత్వాన్ని వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన బ్రెజిల్‌ బృందం ఆయనను కలిసి ఈ విషయంపై సానుకూలంగా స్పందించింది. 

వైఎస్సార్‌ విగ్రహం ఆవిష్కరణ
ప్రకాశం జిల్లా పంగులురు మండలం కల్లమ్‌వారిపాలెంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అద్దంకి ఇంచార్జ్‌ గరటయ్యతో పాటు వైఎస్సార్‌ అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు