వారికోసమే పెట్టారేమో: ఆనంద్‌ మహీంద్రా

27 Dec, 2019 19:33 IST|Sakshi

ముంబయి: మహీంద్రా గ్రూఫ్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆయన ట్విటర్‌ను పరిశీలిస్తే మన హృదయాలను కదిలించే ఎన్నో విషయాలను షేర్‌ చేసుకోవడం గమనిస్తుంటాం. తాజాగా ఆయన ఇలాంటిదే ఒక వీడియోనూ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ వీడియోలో.. ఒక వ్యక్తి స్వీట్‌షాప్‌ ముందు కూర్చుని తన ఫోన్‌లో వీడియో కాలింగ్‌ చేసి సీరియస్‌గా అవతలి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇందులో విషయం ఏముందిలే అని కొట్టి పారేయకండి. ఫోన్‌ మాట్లాడుతున్న వ్యక్తి మూగవాడు అవడంతో అవతలి వ్యక్తితో కేవలం తన సంజ్ఞల ద్వారా విషయం మొత్తం చెప్పడం ఆనంద్‌ మహీంద్రాకు తెగ నచ్చేసింది. అంతే నిమిషం ఆలస్యం చేయకుండా వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

'ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌ అనేది ప్రపంచాన్ని మింగేస్తుందని అందరూ విమర్శిస్తున్నారు. కానీ అదే మొబైల్‌ సరికొత్త టెక్నాలజీతో ఇవాళ మనకు ఒక కొత్త భాషను ప్రపంచానికి పరిచయం చేసిందని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నా. ఒక మాటలు రాని వ్యక్తి తన సైగలతోనే అవతలి వ్యక్తికి సమాచారం చేరవేయడం నాకు కొత్తగా అనిపించింది. బహుశా మూగవారందరు మాట్లాడుకునేందుకే మొబైల్‌ఫోన్‌లో వీడియో కాలింగ్‌ ఆప్షన్‌ను ఏర్పాటు చేసి ఉండొచ్చని' మహీంద్రా భావోద్వేగంతో ట్వీట్‌ చేశారు. తాజాగా ఈ వీడియో వైరల్‌ అవడంతో పాటు మహీంద్రా పెట్టిన కామెంట్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు