ముంబై: భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ప్రకటించిన నజరానా మొత్తాన్ని విడుదల చేయాలని అఖిల భారత వికలాంగుల క్రికెట్ సంఘం (ఏఐసీఏపీసీ) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని కోరింది. ఇంగ్లండ్ గడ్డపై గతేడాది భారత దివ్యాంగుల క్రికెట్ జట్టు టి20 వరల్డ్ సిరీస్ నెగ్గింది. బీసీసీఐ వారికి ప్రోత్సాహకంగా రూ. 65 లక్షల నజరానా ప్రకటించింది. ఈ మార్చి 4న దివ్యాంగుల జట్టు కెప్టెన్ విక్రాంత్ కెనీకి బోర్డు అధ్యక్షుడు గంగూలీ ఈ చెక్ అందజేయగా... డబ్బు మాత్రం ఇంకా ఆటగాళ్ల ఖాతాలోగానీ, ఏఐసీఏపీసీ ఖాతాలోగానీ బదిలీ చేయలేదు.దీనిపై బోర్డు ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. కొన్ని ప్రతికూల అంశాలతో పాటు, లాక్డౌన్ వల్ల బోర్డు కార్యకలాపాలకు ఏర్పడిన అంతరాయం వల్లే నిధుల మంజూరు జరగలేదని, త్వరలోనే నగదు విడుదల చేస్తామని చెప్పారు.