హెచ్‌సీఏ అధ్యక్ష బరిలో అజహర్‌

19 Sep, 2019 15:19 IST|Sakshi

హైదరాబాద్‌: రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అప్పట్లో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్‌ దాఖలు  చేశారు అజహర్‌. ఈనెల 27వ తేదీన జరుగునున్న హెచ్‌సీఏ ఎన్నికలో భాగంగా గురువారం అజహర్‌ నామినేషన్‌ వేశారు.

‘ హెచ్‌సీఏ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం. దాంతోనే అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేశా. ప్రతీ ఒక్కరి నుంచి సలహాలు తీసుకుంటూ హైదరాబాద్‌ క్రికెట్‌ను ఉన్నత స్థానంలో నిలపాలనుకుంటున్నా. జిల్లా స్థాయి క్రికెట్‌ను కూడా తీర్చిదిద్దాల్సిన అవసరంఉంది. నాకు విక్రమ్‌ మాన్‌ సింగ్‌తో పాటు మాజీ క్రికెటర్లు అర్హద్‌ అయూబ్‌, శివలాల్‌ యాదవ్‌లు సహకారం ఉంది’ అని అజహర్‌ తెలిపారు. కాగా,  మాజీ క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్‌  ఆర్పీ మాన్‌ సింగ్‌ కుమారుడు విక్రమ్‌ మాన్‌ సింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రేసులో ఉన్నారు. గతంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజహర్‌ నామినేషన్‌ వేయగా అది తిరస్కరణకు గురైంది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి ‘సంతృప్తికర వివరణ’ ఇవ్వకపోవడంతో అజహర్‌ నామినేషన్‌ను ఆమోదించలేదు.

మరిన్ని వార్తలు