ఒలింపిక్స్‌ బెర్త్‌ పట్టేశారు..

19 Sep, 2019 17:18 IST|Sakshi

నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌) : ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మహిళల 53 కేజీల విభాగంలో వినేశ్‌ ఫోగాట్‌ కాంస్య పతకం నెగ్గడంతో పాటు.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం పురుషుల రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, రవి దహియా సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ఫలితంగా ఒలింపిక్స్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో కొరియాకు చెందిన సన్‌ జాంగ్‌ను 8-1 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించిన బజరంగ్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. 

అదేవిధంగా పరుషుల 57 కేజీల విభాగంలో మరో భారత రెజ్లర్‌ రవి దహియా జపాన్‌ క్రీడాకారుడు యుకి తకాషిని 6-1 తేడాతో ఓడించి సగర్వంగా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టడంతో పాటు కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మరోవైపు ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ 62 కేజీల విభాగంలో నైజీరియా క్రీడాకారిణి  అమెనాట్ అడెనియీ చేతిలో ఓడిపోయింది. అయితే అడెనియీ ఫైనల్‌కు చేరడంపైనే సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌ షిప్‌ పతకం ఆధారపడి ఉంది. నైజీరియా క్రీడాకారిణి ఫైనల్‌ చేరుకుంటేనే సాక్షికి రెపిచేజ్‌ ఆడే అవకాశం దక్కుతుంది. 

మరిన్ని వార్తలు