ఆంధ్రను గెలిపించిన జ్యోతి

11 Dec, 2018 00:37 IST|Sakshi

సాక్షి, గుంటూరు వెస్ట్‌: బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు జోరు కొనసాగుతోంది. చత్తీస్‌గఢ్‌తో సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర రెండు వికెట్ల తేడాతో నెగ్గి ఈ టోర్నీలో నాలుగో విజయం నమోదు చేసింది. కె. జ్యోతి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (3/25; 13 నాటౌట్‌)తో ఆంధ్ర జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన చత్తీస్‌గఢ్‌ 44.2 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. జ్యోతితోపాటు పుష్పలత (3/18) కూడా మూడు వికెట్లు పడగొట్టింది.

అంజలి శర్వాణి, సీహెచ్‌ ఝాన్సీ లక్ష్మిలకు ఒక్కో వికెట్‌ దక్కింది. 94 పరుగుల విజయలక్ష్యాన్ని ఆంధ్ర 36.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి అధిగమించింది. 63 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును హిమబిందు (15 నాటౌట్‌), కె.జ్యోతి (13 నాటౌట్‌) గట్టెక్కించారు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు అభేద్యంగా 31 పరుగులు జతచేసి ఆంధ్ర జట్టును గెలిపించారు. ఇతర మ్యాచ్‌ల్లో పంజాబ్‌పై రైల్వేస్‌ తొమ్మిది వికెట్ల తేడాతో... గోవా 12 పరుగుల తేడాతో మహారాష్ట్రపై విజయం సాధించాయి.    

మరిన్ని వార్తలు