ముంబై: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ గట్టి ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న క్రికెటర్లు ఉద్యోగాలు వదులుకోవాలని గట్టి సందేశం పంపింది. బీసీసీఐ ఆదేశాలతో కోహ్లి సేన ఇరకాటంలో పడింది. ఓఎన్జీసీలో కెప్టెన్ కోహ్లి.. మేనేజర్ ఉద్యోగంలో ఉన్నాడు. అతడు ఉద్యోగంలో కొనసాగరాదని బోర్డు కోరుకుంటోంది. ఇంకా చాలా మంది క్రికెటర్లు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులుగా ఉన్నారు. అయితే మ్యాచ్లు లేనిసమయంలో వీరు ఉద్యోగం చేయకుండా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. క్రికెటర్ల ఉద్యోగం డ్యుయల్ కాంట్రాక్టు కిందకు వస్తుందని బీసీసీఐ పేర్కొంది.
అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, ఛతేశ్వర్ పుజారాలకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నాయి. స్థానిక టోర్నమెంట్లలో ఓన్ఎన్జీసీ తరపున కోహ్లి ఆడాడు. చాలా మంది ఢిల్లీ క్రికెటర్లకు ఓఎన్జీసీ ఉద్యోగాలు ఇచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ కూడా ఈ సంస్థలో గౌరవప్రదమైన ఉద్యోగాలు పొందారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ అంశంలో మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ తదితరులపై ఇంతకుముందు బీసీసీఐ దృష్టి సారించింది. తాజాగా క్రికెటర్లకు కూడా ఇవే నిబంధనలు వర్తింపజేయాలని క్రికెట్ బోర్డు నిర్ణయించింది.