ఛాయనిక, దర్శనలకు స్వర్ణాలు 

16 Mar, 2020 14:57 IST|Sakshi

వైఎంసీఏ కరాటే కప్‌  

సాక్షి, హైదరాబాద్‌: యామగుచి కరాటే అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన వైఎంసీఏ కరాటే కప్‌ టోర్నీలో ఛాయనిక, కె. దర్శన ఆకట్టుకున్నారు. వైఎంసీఏ నారాయణగూడ వేదికగా జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. 17 ఏళ్లు పైబడిన బాలికల స్పేరింగ్‌ విభాగంలో ఛాయనిక విజేతగా నిలిచింది. పవిత్ర, నవ్యశ్రీ వరుసగా రజత, కాంస్యాలను అందుకున్నారు. 15 ఏళ్ల బాలికల స్పేరింగ్‌ ఈవెంట్‌లో దర్శన, టిషా మహంత్, మహేశ్వరి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల బ్లాక్‌ బెల్ట్‌ ఈవెంట్‌లో విశ్వనాథ్‌ బంగారు పతకాన్ని అందుకున్నాడు.

మహాదేవ్‌ రజతాన్ని గెలుచుకోగా... కృష్ణ కాంస్యాన్ని సాధించాడు. ఈ టోర్నీలో మొత్తం 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సినీ నటి సుమయా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎంసీఏ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు     పి. ధర్మరాజ్, రిటైర్డ్‌ కార్యదర్శి వినయ్‌ స్వరూప్, గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌కే కృష్ణ, మాస్టర్స్‌ వంశీకృష్ణ, విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.   


 

మరిన్ని వార్తలు