ఇది కదా అసలైన ప్రతీకారం

15 Feb, 2020 11:41 IST|Sakshi

డీకాక్‌ రికార్డు ఫిఫ్టీ వృథా..

రెండు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ విజయం

డర్బన్‌: ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పరుగు తేడాతో దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 178 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఇంగ్లండ్‌ 176 పరుగులకే పరిమితమై పరుగు తేడాతో ఓటమి చూసింది. చివరి బంతికి ఆదిల్‌ రషీద్‌ రనౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ కడవరకూ వచ్చి పరాజయాన్ని చూసింది.  అయితే అందుకు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది ఇంగ్లండ్‌. దక్షిణాఫ్రికా జట్టు చేతిలో పరుగు తేడాతో ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్‌ దెబ్బకు దెబ్బకు రూచిచూపించింది. రెండో టీ20లో రెండు పరుగుల తేడాతో గెలిచి ఇది కదా అసలైన ప్రతీకారం అనే రీతిలో బదులిచ్చింది. రెండో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. (ఇక‍్కడ చదవండి: పరుగు తేడాతో గెలుపు.. స్టెయిన్‌ రికార్డు)

జోసన్‌ రాయ్‌(40), బెయిర్‌ స్టో(35), మోర్గాన్‌(27), బెన్‌ స్టోక్స్‌(47 నాటౌట్‌), మొయిన్‌ అలీ(39)లు వచ్చిన వారు వచ్చినట్లే బ్యాట్‌ ఝుళిపించడంతో ఇంగ్లండ్‌ రెండొందల మార్కును సునాయాసంగా చేరింది. అనంతరం 205 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సఫారీల చివరి వరకూ పోరాడారు. ఓపెనర్లలో బావుమా(35) ఫర్వాలేదనిపించగా, కెప్టెన్‌ డీకాక్‌( 65:22 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా తరఫున వేగవంతంగా టీ20 హాఫ్‌ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

అనంతరం మిల్లర్‌(21), వాన్‌డెర్‌ డస్సెన్‌(43 నాటౌట్‌)లు బ్యాట్‌ ఝుళిపించారు. ఆపై ప్రిటిరియోస్‌(25) ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. ప్రధానంగా చివరి ఓవర్‌లో సఫారీల విజయానికి 15 పరుగులు కావాల్సిన తరుణంలో ప్రిటిరియోస్‌ తొలి మూడు బంతులకు 10 పరుగులు చేశాడు. టామ్‌ కరాన్‌ వేసిన ఆ ఓవర్‌ రెండు బంతికి సిక్స్‌ కొట్టిన ప్రిటిరియోస్‌.. మూడో బంతిని ఫోర్‌ కొట్టాడు. నాల్గో బంతికి రెండు పరుగులు తీయగా, ఐదో బంతికి ప్రిటిరియోస్‌ ఔటయ్యాడు. ఆఖరి బంతికి మూడు పరుగులు చేయాల్సిన సమయంలో ఫార్చున్‌ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. దాంతో ఇంగ్లండ్‌ రెండు పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసిన సిరీస్‌ను సమం చేసింది. ఇక సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం జరుగనుంది. 

అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా ఇలా విజయానికి దగ్గరగా వచ్చి పరుగు, రెండు పరుగులు తేడాతో ఓడిపోవడం మూడోసారి.  అంతకుముందు 2009లో జోహెనెస్‌బర్గ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు పరుగు తేడాతో ఓటమి చెందగా, 2012లో కొలంబోలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పరుగు తేడాతోనే ఓటమి పాలయ్యాడు. ఆపై ఇంతకాలానికి మరో అతి స్వల్ప ఓటమిని దక్షిణాఫ్రికా రుచిచూసింది. 

>
మరిన్ని వార్తలు