సెమీస్‌లో  దివిజ్‌ జంట 

3 May, 2019 04:58 IST|Sakshi

మ్యూనిక్‌: బీఎండబ్ల్యూ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–మార్సెలో డెమోలైనర్‌ (బ్రెజిల్‌) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. జర్మనీలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో దివిజ్‌–మార్సెలో ద్వయం 4–6, 6–3, 10–8తో కెవిన్‌ క్రావిట్జ్‌–ఆండ్రియా మీస్‌ (జర్మనీ) జంటపై గెలుపొందింది. గంటా 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన దివిజ్‌ జంట రెండో సెట్‌లో ఒకసారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసింది. ఆ తర్వాత తమ సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకుంది.

నిర్ణాయక సూపర్‌ టైబ్రేక్‌లో సంయమనంతో ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో ఫిలిప్‌ ఓస్వాల్‌ (ఆస్ట్రియా)–మ్యాట్‌ పావిక్‌ (క్రొయేషియా) జంటతో దివిజ్‌–మార్సెలో తలపడతారు. క్వార్టర్‌ ఫైనల్లో ఓస్వాల్డ్‌–పావిక్‌ 6–4, 6–4తో మూడో సీడ్‌ కెన్‌ స్కప్‌స్కీ–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌)లపై గెలిచారు. 

మరిన్ని వార్తలు