భారత్, ఇంగ్లండ్‌ యూత్‌ టెస్టు డ్రా

17 Feb, 2017 00:16 IST|Sakshi
భారత్, ఇంగ్లండ్‌ యూత్‌ టెస్టు డ్రా

నాగ్‌పూర్‌: భారత్‌ అండర్‌–19 జట్టు వికెట్‌ కీపర్‌  సురేశ్‌ లోకేశ్వర్‌ (125 బంతుల్లో 92 నాటౌట్‌; 14 ఫోర్లు) వీరోచితంగా పోరాడటంతో ఇంగ్లండ్‌ అండర్‌–19 జట్టుతో జరిగిన యూత్‌ టెస్టు తొలి మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. 238 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్‌ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి  రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 8 వికెట్లకు 189 పరుగులతో నిలిచి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. బ్యాటింగ్‌లో టాపార్డర్‌ విఫలవైునా.... లోయర్‌ ఆర్డర్‌ సహకారంతో లోకేశ్వర్‌ విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు.  లోకేశ్వర్‌తో పాటు తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో డారిల్‌ ఫెరారియో (37) రాణించాడు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో హెన్రీ బ్రూక్స్‌ 3, ఆరోన్  బియర్డ్‌ 2 వికెట్లు దక్కించుకున్నారు. అంతకుముందు 23/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్‌ జట్టు... ఆఫ్‌ స్పిన్నర్‌ సిజోమో్న్ జోసెఫ్‌ (6/62) దాటికి 53 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. 70 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్‌ 238 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. జార్జ్‌ బార్ట్‌లెట్‌ (97 బంతుల్లో 68; 11 ఫోర్లు, 1 సిక్సర్‌) అర్ధసెంచరీ చేయగా... హ్యారీ బ్రూక్‌ (58 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించాడు. భారత బౌలర్లలో డారిల్‌ ఫెరారియో 2 వికెట్లు పడగొట్టగా... కనిష్క్‌ సేత్, రిషభ్‌ భగత్‌ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 501/5 డిక్లేర్‌ చేయగా... భారత్‌ 431/8 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

మరిన్ని వార్తలు