విజేతలు రంగారెడ్డి, హైదరాబాద్‌

13 Aug, 2018 10:32 IST|Sakshi

రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రస్థాయి జూనియర్‌ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జట్లు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలుర విభాగంలో హైదరాబాద్, బాలికల కేటగిరీలో రంగారెడ్డి విజేతలుగా నిలిచాయి. ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో హైదరాబాద్‌ 21–14, 21–15తో ఆదిలాబాద్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో హైద రాబాద్‌ 21–10, 21–14తో ఖమ్మంపై, ఆదిలాబాద్‌ 18–21, 21–18, 21–16తో రంగారెడ్డిపై గెలుపొందాయి.

బాలికల టైటిల్‌పోరులో రంగారెడ్డి 19–21, 21–12, 21–12తో హైదరాబాద్‌ను ఓడించింది. సెమీస్‌ మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 21–16, 21–15తో నిజామాబాద్‌పై, హైదరాబాద్‌ 22– 24, 21–9, 21–12తో మెదక్‌పై నెగ్గాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్‌ మమత గుప్తా ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సెపక్‌తక్రా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీధర్, కార్యదర్శి ఎస్‌.ఆర్‌ ప్రేమ్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.      

మరిన్ని వార్తలు