సఫారీల సంగతి తేల్చాలి

14 Sep, 2019 01:09 IST|Sakshi

స్వదేశంలో దక్షిణాఫ్రికాపై తొలిసారి టి20 సిరీస్‌ నెగ్గే అవకాశం

2015–16లో 0–2తో ఓటమి

ప్రస్తుత బలాబలాల్లో టీమిండియానే మెరుగు

స్వదేశంలో ఏ ఫార్మాట్‌లోనైనా టీమిండియా ఎంత బలమైనదో అందరికీ తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా సొంతగడ్డపై సిరీస్‌ విజయాలు మన ఖాతాలో చేరడం లాంఛనమే. మిగతా అన్ని దేశాలపై టి20ల్లోనూ ఇదే పంథా సాగినా... దక్షిణాఫ్రికా ఒక్కటే ఇప్పటి వరకు తప్పించుకుంది. ఇరు జట్ల మధ్య భారత్‌లో ఒక్కసారే పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌ జరగ్గా అందులో సఫారీలే విజయం సాధించారు. మొత్తమ్మీద మాత్రం 8–5తో గణాంకాల్లో టీమిండియాదే పైచేయిగా ఉంది. ఆదివారం నుంచి మొదలుకానున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కోహ్లి సేన కైవసం చేసుకుంటే మిగిలిపోయిన ‘ఈ ఒక్క ప్రత్యరి్థ’ సంగతీ తేలి్చనట్లవుతుంది.  

సాక్షి క్రీడా విభాగం
టీమిండియా టి20ల అరంగేట్ర–గెలుపు బోణీ (2006 డిసెంబరు 1న) కొట్టింది దక్షిణాఫ్రికాపైనే. తర్వాత ఐసీసీ టోరీ్నలు కాక ఇరు జట్లు నాలుగు సార్లు ఈ ఫార్మాట్‌లో ముఖాముఖిగా తలపడ్డాయి. 2010–11; 2011–12 సఫారీ పర్యటనల్లో జరిగిన ఏకైక టి20లలో భారత్‌ ఒకటి గెలిచి, మరోటి ఓడింది. 2017–18 టూర్‌లోనూ 2–1తో నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకుంది. వీటి మధ్య ఒకే ఒక్కసారి మన గడ్డపై 2015–16లో ఆడిన ప్రొటీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే సిరీస్‌ను గెలవడం... గణాంకాలను మెరుగుపర్చుకునే దిశగా కోహ్లి సేనకు ఓ అవకాశం కానుంది.

పైచేయి మనదే...
దక్షిణాఫ్రికాతో పూర్తిస్థాయిలో జరిగిన 13 మ్యాచ్‌ల్లో భారత్‌ ఎనిమిదింట్లో విజయం సాధించి మంచి ఆధిక్యంలో ఉంది. వీటిలో 2007 ప్రపంచ కప్‌ సూపర్‌–8 దశ సహా 2012–13, 2013–14 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ఉండటం గమనార్హం. టి20 విశ్వ సమరంలో 2009లో మాత్రమే టీమిండియా వారికి తలొంచింది. అయితే, బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి నాలుగేళ్ల క్రితం నాటి పర్యటనలో పటిష్టంగా ఉన్న భారత్‌కు షాకిచి్చంది. నాడు అక్టోబరు 2న... నేటి సిరీస్‌ తొలి మ్యాచ్‌కు వేదిౖకైన ధర్మశాలలోనే జరిగిన పోరులో రోహిత్‌ శర్మ శతకం (106)తో పాటు కోహ్లి (43) రాణించడంతో టీమిండియా నిరీ్ణత ఓవర్లలో 199 పరుగులు చేసింది.

భారీ లక్ష్య ఛేదనలో విధ్వంసక డివిలియర్స్‌ (51) అర్ధసెంచరీకి డుమిని (34 బంతుల్లో 68; ఫోర్, 7 సిక్స్‌లు) మెరుపులు తోడవడంతో సఫారీలు రెండు బంతులు మిగిలి ఉండగానే గెలిచేశారు. ఇక కటక్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో బౌలర్ల ఆధిపత్యం నడిచింది. అల్బీ మోర్కెల్‌ (3/12)ధాటికి భారత్‌ 92 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా కాస్త కష్టపడినా డుమిని (30 నాటౌట్‌) నిలవడంతో 17.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుని నెగ్గి సిరీస్‌ను ఒడిసిపట్టింది. కోల్‌కతాలో  మూడో మ్యాచ్‌ రద్దవడంతో భారత్‌కు ఒక్కటైనా గెలుపు దక్కనట్లయింది.

అప్పటికి... ఇప్పటికి చాలా తేడా
డివిలియర్స్, ఆమ్లా, డుమిని, డు ప్లెసిస్‌ వంటి దక్షిణాఫ్రికా దిగ్గజాలు తప్పుకొన్న నేపథ్యంలో రాబోయే సిరీస్‌లో కోహ్లి సేనే ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. కెపె్టన్‌గా డికాక్‌ బాధ్యతలు చేపట్టిన ప్రత్యర్థి జట్టులో మిల్లర్, రబడ మాత్రమే పేరున్న ఆటగాళ్లు. అయితే, టి20లకు తగినట్లు ఆడే డాలా, డసెన్, నోర్జెలాంటి యువకులతో సఫారీలు బలంగానే కనిపిస్తున్నారు. ఇటు భారత్‌వైపు చూస్తే 2015 సిరీస్‌లో ఆడిన ధోని, రాయుడు, రైనా, హర్భజన్, అశి్వన్‌ తెరమరుగయ్యారు. వారి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్, మనీశ్‌ పాండే, హార్దిక్, కృనాల్‌ పాండ్యా, రిషభ్‌ పంత్, వాషింగ్టన్‌ సుందర్‌ తదితరులు వచ్చారు. దీనిప్రకారం తాజా సిరీస్‌ వెలుగులోకి వచ్చేందుకు రెండు జట్లలోని పలువురు కుర్రాళ్లకు ఓ వేదికగా మారనుంది.

మరిన్ని వార్తలు