భారత్‌ డబుల్‌ ధమాకా

22 Aug, 2019 04:50 IST|Sakshi

ఒలింపిక్‌ టెస్ట్‌ ఈవెంట్‌ హాకీ టోర్నీలో పురుషుల, మహిళల విభాగం టైటిల్స్‌ సొంతం  

టోక్యో: జపాన్‌ గడ్డపై భారత పురుషుల, మహిళల హాకీ జట్లు గర్జించాయి. ఒలింపిక్‌ టెస్టు ఈవెంట్‌లో భారత జట్లే విజేతలుగా నిలిచాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు కొత్తగా నిర్మించిన స్టేడియాలని ప్రాక్టికల్‌గా పరిశీలించేందుకు ఈ టోర్నీలను నిర్వహిస్తారు. ఇందులో పురుషుల జట్టయితే లీగ్‌లో కివీస్‌ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 5–0తో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (7వ ని.), షంషీర్‌ సింగ్‌ (18వ ని.), నీలకంఠ శర్మ (22వ ని.), గుర్‌సాహిబ్‌జిత్‌ సింగ్‌ (26వ ని.), మన్‌దీప్‌ సింగ్‌ (27వ ని.) తలా ఒక గోల్‌తో భారత్‌కు ఎదురులేని విజయాన్ని అందించారు.

మహిళల జట్టు జపాన్‌పై...
భారత మహిళల జట్టు ఆతిథ్య జట్టును 2–1తో ఓడించి టైటిల్‌ గెలుచుకుంది. భారత్‌ తరఫున నవజ్యోత్‌ కౌర్‌ (11వ ని.), లాల్‌రెమ్‌సియామి (33వ ని.) ఒక్కో గోల్‌ చేశారు. జపాన్‌ తరఫున మినామి (12వ ని.) ఏకైక గోల్‌ సాధించింది.

మరిన్ని వార్తలు