భారత బాలికల జట్టుకు తొలి గెలుపు

19 Apr, 2019 15:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆసియా ఓసియానియా జూనియర్‌ ఫెడ్‌ కప్‌ టోర్నమెంట్‌లో భారత బాలికల జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. గ్రూప్‌ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన భారత్‌ ప్రస్తుతం 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇండోనేసియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3–0తో గెలుపొందింది.

తొలి సింగిల్స్‌లో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల 6–2, 6–0తో జెస్సికా క్రిస్టా వీరా (ఇండోనేసియా)పై నెగ్గి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో సింగిల్స్‌లో తెలంగాణకే చెందిన మరో అమ్మాయి భక్తి షా 6–1, 6–0తో నికెన్‌ ఫెరిలియానా (ఇండోనేసియా)ను ఓడించి భారత్‌కు 2–0తో ఆధికాన్ని అందించడంతోపాటు విజయాన్ని ఖాయం చేసింది. నామమాత్రమైన డబుల్స్‌ మ్యాచ్‌లో సుదీప్త–భక్తి షా ద్వయం 6–2, 6–4తో జెస్సికా–నికెన్‌ జోడీని ఓడించింది. శుక్రవారం జరిగే మరో వర్గీకరణ మ్యాచ్‌లో మలేసియాతో భారత్‌ ఆడుతుంది.   

మరిన్ని వార్తలు