26 ఏళ్ల రికార్డుకు చేరువలో కోహ్లి

11 Aug, 2019 10:47 IST|Sakshi

ట్రినిడాడ్‌: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. వెస్టిండీస్‌పై వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును నమోదు చేసేందుకు 19 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకూ విండీస్‌పై కోహ్లి సాధించిన వన్డే పరుగులు 1912. విండీస్‌తో ఆదివారం జరుగనున్న రెండో వన్డేలో కోహ్లి కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్‌ దిగ్గజ ఆటగాడు జావేద్‌ మియాందాద్‌ పేరిట ఉంది. విండీస్‌పై మియాందాద్‌ 1930 వన్డే పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాత స్థానంలో కోహ్లి ఉన్నాడు.

జావేద్‌ ఈ పరుగుల్ని చేయడానికి 64 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. కాగా, విండీస్‌తో రెండో వన్డేలో కోహ్లి ఈ మార్కును అధిగమిస్తే 34 ఇన్నింగ్స్‌లోనే దాన్ని సాధించినట్లవుతుంది. ఇప్పటివరకూ విండీస్‌పై వన్డే ఫార్మాట్‌లో కోహ్లి  7 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు చేశాడు. కాగా, మియాందాద్‌ కేవలం ఒక్క సెంచరీ మాత్రమే విండీస్‌పై చేయగా, 12 అర్థ శతకాలు నమోదు చేశాడు.  1993లో మియాందాద్‌ తన చివరి వన్డేలో ఈ ఫీట్‌ సాధించాడు. మియాందాద్‌ 26 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేయడానికి కోహ్లి స్వల్ప దూరంలో ఉన్నాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది.

మరిన్ని వార్తలు