IND Vs AUS 1st T20: ఆసీస్‌తో తొలి టీ20.. టీమిండియాలో ఎవరెవరు..?

23 Nov, 2023 13:50 IST|Sakshi

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 23) తొలి మ్యాచ్‌ జరుగనుంది. వైజాగ్‌ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం​ తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియా సారధిగా వ్యవహరించనున్నాడు. మాథ్యూ వేడ్‌ ఆసీస్‌ కెప్టెన్‌గా బరిలో ఉంటాడు. 

ఈ సిరీస్‌ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆసీస్‌ సైతం పలువురు రెగ్యులర్‌ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, పేసర్లు స్టార్క్‌, హాజిల్‌వుడ్‌, ఆల్‌రౌండర్‌ మిచెల్ మార్ష్‌ వరల్డ్‌కప్‌ ముగిసిన అనంతరం స్వదేశానికి వెళ్లిపోయారు. 

వరల్డ్‌కప్‌ హీరోలు ట్రవిస్‌ హెడ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపా జట్టులో ఉన్నప్పటికీ వారు తొలి మ్యాచ్‌ ఆడకపోవచ్చు. ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ వారికి విశ్రాంతి కల్పించవచ్చు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను మాథ్యూ షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌ ఆరంభించే అవకాశం ఉంది. ఇతర సభ్యులుగా మ్యాథ్యూ వేడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, ఆరోన్‌ హర్డీ, మార్కస్‌ స్టోయినిస్‌, టిమ్‌ డేవిడ్‌, సీన్‌ అబాట్‌, నాథన్‌ ఇల్లిస్‌, జేసన్‌ బెహ్రన్‌డార్ఫ్‌, తన్వీర్‌ సంగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

టీమిండియా విషయానికొస్తే.. ఓపెనింగ్‌ విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లలో ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి. ఇషాన్‌ కిషన్‌తో పాటు వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు. వన్‌డౌన్‌లో తిలక్‌ వర్మ, ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌, రింకూ సింగ్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, ఆర్షదీప్‌ సింగ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌ బరిలోకి దిగుతారు. అదనపు బ్యాటర్‌తో బరిలోకి దిగాలనుకుంటే ఓ పేసర్‌ బదులు రుతురాజ్‌, యశస్విలలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు.

మరిన్ని వార్తలు