హైదరాబాద్ 522 ఆలౌట్
సాక్షి, విశాఖపట్నం: రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఆంధ్ర జట్టు హైదరాబాద్కు దీటైన జవాబు ఇస్తోంది. మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్లో 31 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్ (99 బంతుల్లో 71 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), డీబీ ప్రశాంత్ (87 బంతుల్లో 50 బ్యాటింగ్; 8 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. అంతకు ముందు హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్లో 522 పరుగులకు ఆలౌటైంది.
281/6 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన హైదరాబాద్ చివరి నాలుగు వికెట్లకు మరో 241 పరుగులు జత చేయడం విశేషం. సీవీ మిలింద్ (113 బంతుల్లో 97 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్), ఆశిష్ రెడ్డి (104 బంతుల్లో 95; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) తొమ్మిదో వికెట్కు 162 పరుగులు జోడించి జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. ఇబ్రహీం ఖలీల్ (40) రాణించగా...ఆంధ్ర బౌలర్లలో దువ్వారపు శివకుమార్ 4 వికెట్లు పడగొట్టాడు.