టీ ‘20’ స్థానాలు ఎగబాకాడు..!

7 Sep, 2019 16:12 IST|Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్‌లో శ్రీలంక వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగా ఒకేసారి 20స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో మలింగా వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించడం ద్వారా ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. ప్రస్తుతం మలింగా 21వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు 41 స్థానంలో ఉన్న మలింగా.. కివీస్‌పై అద్భుత ప్రదర్శన తర్వాత తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకున్నాడు.నిన్న కివీస్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించడంతో వన్డేల్లోనూ టీ20ల్లోనూ ఆ ఫీట్‌ సాధించిన తొలి బౌలర్‌గా మలింగా రికార్డు నెలకొల్పాడు.

అదే సమయంలో అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల మార్కును చేరి తొలి బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. ఇక అఫ్గాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ తన టాప్‌ ర్యాంకును కాపాడుకున్నాడు. న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ మిచెల్‌ సాంత్నార్‌ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో స్థానంలో నిలిచాడు. భారత స్పిన్నర్‌ టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. భారత్‌ నుంచి టాప్‌-10లో నిలిచిన ఏకైక బౌలర్‌ కుల్దీప్‌.  తాజా ర్యాంకింగ్స్‌లో కుల్దీప్‌ 8వ స్థానంలో ఉన్నాడు.  ఇక బ్యాట్స్‌మెన్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ టాప్‌ను కాపాడుకున్నాడు. అతని తర్వాత స్థానంలో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ రెండో స్థానానికి చేరగా, కొలిన్‌ మున్రో మూడో స్థానానికి పడిపోయాడు. ఇక భారత్‌ నుంచి కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు టాప్‌-10లో నిలిచారు. రాహుల్‌7వ స్థానంలో రోహిత్‌ 9వ స్థానంలో కొనసాగుతున్నారు.

>
మరిన్ని వార్తలు