మంధాన మెరుపులు.. సిరీస్‌ కైవసం

7 Nov, 2019 13:49 IST|Sakshi

ఆంటిగ్వా: వెస్టిండీస్‌ మహిళలతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళలు కైవసం చేసుకున్నారు. చివరిదైన మూడో వన్డేలో భారత మహిళలు ఆరు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1 తో చేజిక్కించుకున్నారు. స్మృతీ మంధాన చెలరేగడంతో భారత్‌ అవలీలగా గెలుపొందడంతో సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. తొలి వన్డేలో వెస్టిండీస్‌ మహిళలు విజయం సాధించగా, రెండు, మూడు వన్డేల్లో భారత గెలిచింది. ఆఖరి వన్డేలో విండీస్‌ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు నాలుగు వికెట్లు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్‌(69; 92 బంతుల్లో 6 ఫోర్లు), స్మృతి మంధాన(74; 63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో భారత్‌ సునాయాసంగా గెలుపొందింది. ప్రధానంగా మంధాన మెరుపులు మెరిపించడంతో భారత్‌ 42. 1 ఓవర్లలోనే విజయం సాధించింది.

గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన మంధాన.. రీఎంట్రీలోనే అదరగొట్టింది. తొలి వికెట్‌కు 141 పరుగులు జత చేసిన తర్వాత రోడ్రిగ్స్‌ ఔట్‌ అయ్యింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ మహిళలు 50 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌటయ్యారు. విండీస్‌ కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌(79) మరోసారి రాణించగా, మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో గోస్వామి, పూనమ్‌ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు సాధించగా, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్‌, దీప్తి శర్మలు తలో వికెట్‌ తీశారు. మూడు వికెట్లు రనౌట్ల రూపంలో రావడం విశేషం.

మరిన్ని వార్తలు