అదొక మానసిక క్షోభ: షమీ

24 Mar, 2018 14:30 IST|Sakshi
మహ్మద్‌ షమీ

డెహ్రాడూన్‌: తనను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) కాంట్రాక్ట్‌ నుంచి తప్పించిన క్షణంలో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని పేసర్‌ మహ్మద్‌ షమీ తాజాగా పేర్కొన్నాడు. తాను మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేశానంటూ భార్య హసీన్‌ జహాన్‌ చేసిన ఆరోపణలు చాలా ఎక్కువగా బాధించాయన్నాడు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌, ఇతర మహిళలతో సంబంధాలు, హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ షమి భార్య జహాన్‌ సంచనల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు బీసీసీఐ షమికి కాంట్రాక్టులో స్థానం కల్పించలేదు. అయితే దర్యాప్తు తర్వాత షమి ఎలాంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని తేలడంతో బీసీసీఐ ‘బి’ గ్రేడ్‌ కాంట్రాక్టులో చోటు కల్పించారు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేకపోవడం, బీసీసీఐ కాంట్రాక్టు దక్కడం, ఐపీఎల్‌లో ఆడటంపై షమి తాజాగా సంతోషం వ్యక్తం చేశాడు. 'ఇది పూర్తిగా కుటుంబానికి సంబంధించిన సమస్య. నాకు వ్యతిరేకంగా వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. గత 10-15 రోజులుగా ఎంతో మానసిక క్షోభకు గురయ్యా. ఈ రోజులన్ని ఎంతో కఠినంగా గడిచాయి. వీలైనంత త్వరగా మిగతా వాటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా' అని షమీ తెలిపాడు.
 

మరిన్ని వార్తలు