'ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు అనుకున్నా'

3 May, 2020 09:26 IST|Sakshi

ఢిల్లీ : వ్యక్తిగత, క్రికెట్ కెరీర్​ సంబంధిన సమస్యలు, మానసిక వేదన కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై మూడుసార్లు ​ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు భారత స్టార్ పేసర్ మహ్మద్‌ షమీ చెప్పాడు. టీమిండియా ఓపెనర్‌ రోహిత్​శర్మతో ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ ద్వారా మాట్లాడిన షమీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2018 ప్రారంభంలో తన భార్య హసిన్ జహాన్ షమీ, అతడి సోదరుడిపై సెక్షన్‌ 498ఏ కింద గృహ హింస కేసు పెట్టింది. ఇది జరిగిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో షమీ గాయపడ్డాడు. ఆ సమయంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను, ఒత్తిడిని షమీ ఇప్పుడు వెల్లడించాడు. (అజహర్‌... తీన్‌మార్)‌

'నా భార్బ గృహ హింస కేసు పెట్టడంతో కుటుంబ సమస్యలు ప్రారంభమయ్యాయి.. అప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది. ఐపీఎల్​కు మరో 10-12రోజులు ఉందనగా ఆ ప్రమాదం జరిగింది. అలాగే నా వ్యక్తిగత విషయాలు మీడియాలో నడిచాయి. ఒకవేళ నా కుటుంబం మద్దతు లేకపోతే నేను క్రికెట్ కెరీర్​ను కోల్పోతానేమో అని ఆలోచించా. ఆ సమయంలో తీవ్ర వ్యక్తిగత సమస్యల కారణంగా మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన మూడుసార్లు వచ్చింది. మేం 24వ అంతస్తులో ఉండేవాళ్లం. నేను అక్కడి నుంచి దూకేస్తానేమోనని మా కుటుంబ సభ్యులు భయపడేవారు. నా సోదరుడు నాకు చాల మద్దతుగా నిలిచాడు.  ఆ సమయంలో 24గంటలు నాతో పాటే ఉండి నన్నుకంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆ బాధ నుంచి బయటపడి క్రికెట్‌పై దృష్టి సారించాలని నా తల్లిదండ్రులు చెప్పేవారు. వారు నా మంచి కోసమే చెబుతున్నారని భావించి దెహ్రాదూన్ అకాడమీలో ట్రైనింగ్‌ ప్రారంభించి చాలా శ్రమించానంటూ' పేర్కొన్నాడు.

2015 ప్రపంచకప్ తర్వాత గాయం నుంచి కోలుకునేందుకు 18నెలల సమయం పట్టడంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యానని, అప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందన్నాడు. తన కుటుంబం మద్దతుగా నిలువకపోయి ఉంటే ఆత్యహత్య చేసుకొని ఉండేవాడినేమోనని మహ్మద్‌ షమీ తెలిపాడు.

మరిన్ని వార్తలు