కన్నీళ్లురాని ఇండియన్‌ ఉండరు : మోదీ

14 Jul, 2018 12:33 IST|Sakshi
నరేంద్ర మోదీ, హిమ దాస్‌ (పాత చిత్రం)

న్యూఢిల్లీ : ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రికార్డ్‌ టైమింగ్‌తో భారత క్రీడాకారిణి హిమ దాస్‌ స్వర్ణం నెగ్గిన విషయం తెలిసిందే. హిమ దాస్‌ అరుదైన ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘హిమ దాస్‌ విజయం మరిచిపోలేని క్షణాలు. రేసులో నెగ్గిన వెంటనే జాతీయ పతాకం కోసం ఆమె అన్వేషిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆపై విజేతగా నిలిచిన హిమ దాస్‌ మన జాతీయ గీతాన్ని పాడటం మనసును కరిగించింది. ఈ వీడియో చూసిన భారతీయులెవ్వరూ సంతోషంతో కంటతడి పెట్టకుండా ఉండలేరంటూ’ మోదీ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

కాగా, ఫిన్లాండ్‌లోని టాంపెరెలో జరుగుతున్న ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగులో ఆమె 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం నెగ్గారు. ఐఏఏఎఫ్‌ వరల్డ్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌ హిమ కావడం విశేషం. ఆ రేసులో ఆండ్రియా మెక్లోస్‌ (రొమేనియా– 52.07సెకన్లు), టేలర్‌ మ్యాన్షన్‌ (అమెరికా – 52.28 సెకన్లు) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో ఆరో స్థానంలో నిలిచారు. తన తాజా ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారు హిమ దాస్‌.

మరిన్ని వార్తలు