టీమిండియాపై ఏబీ ప్రశంసలు!

19 Jan, 2018 11:36 IST|Sakshi

జోహెనెస్‌బర్గ్‌: సఫారీలతో జరిగిన వరుస రెండు టెస్టుల్లో ఓటమి పాలై ముందుగానే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాపై ఒకవైపు విమర్శలు తారాస్థాయికి చేరితే, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ మాత్రం ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన భారత్‌ జట్టు తనను నిజంగానే ఆకట్టుకుందంటూ కొనియాడాడు. ఇక్కడ ఆ జట్టు సిరీస్‌ను కోల్పోవడం కంటే కూడా మెరుగైన ప్రదర్శన చేసిందన్నాడు. ప్రధానంగా టీమిండియా పేస్‌ బౌలింగ్‌ అమోఘమంటూ ఏబీ ప్రశంసించాడు. ' నన్ను టీమిండియా చాలా ఎక్కువగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా వారు పేస్‌ బౌలింగ్‌తో మమ్ముల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. టీమిండియా పేస్‌ బౌలింగ్‌లో చాలా వైవిధ్యం కనబడింది. మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా టీమిండియా పేస్‌ బౌలర్లు దుమ్మురేపారు' అని ఏబీ పొగిడాడు.

అయితే తమ క్రికెటర్ల సమష్టి ప్రదర్శనతోనే పటిష్టమైన టీమిండియాపై విజయం సాధ్యమైందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఏబీ చెప్పాడు. ఇక్కడ ప్రతీఒక్కరూ తమ శక్తివంచన లేకుండా కృషి చేయడంతోనే సిరీస్‌ను గెలిచామన్నాడు. ముఖ్యంగా కీలక సమయాల్లో తమ బౌలర్లు బ్యాట్‌తో మెరవడాన్ని ఏబీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇది ఏ ఒక్కరి విజయం కాదని, అందరి పోరాటం వల్లే సిరీస్‌ను సొంతం చేసుకున్నామన్నాడు.టెస్టులు అనేవి ఎప్పటికీ ఒక సవాల్‌తో కూడుకున్నవని, అందులో ఎటువంటి సందేహం లేదన్నాడు.


 

మరిన్ని వార్తలు