రంజీ క్వార్టర్స్‌లో ఆంధ్ర ఓటమి

19 Feb, 2015 00:36 IST|Sakshi

75 పరుగుల తేడాతో మహారాష్ట్ర గెలుపు
 లాహ్లి: బౌలర్లు రాణించినా... బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌కు చేరుకునే అరుదైన అవకాశాన్ని ఆంధ్ర జట్టు చేజార్చుకుంది. మహారాష్ట్ర నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక బ్యాట్స్‌మెన్ చతికిలపడ్డారు. దీంతో మూడు రోజుల్లోనే ముగిసిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో మహారాష్ట్ర 75 పరుగుల తేడాతో ఆంధ్రపై విజయం సాధించి సెమీస్‌కు చేరింది.
 
 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బుధవారం మూడో రోజు బరిలోకి దిగిన ఆంధ్ర 46.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. ప్రదీప్ (80 బంతుల్లో 25; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. ప్రశాంత్ (18)తో సహా మిగతా వారు ఘోరంగా నిరాశపర్చారు. ఆంధ్ర 46 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు చేజార్చుకోవడం గమనార్హం. మహారాష్ట్ర బౌలర్లలో సంక్లేచా నాలుగు వికెట్లు తీశాడు. అంతకుముందు 172/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 68.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.  ఆంధ్ర బౌలర్లలో శివకుమార్ మరోసారి ఆరు వికెట్లు తీశాడు.
 

మరిన్ని వార్తలు