భుయ్ అదృష్టం
ముంబై: ఆంధ్ర బ్యాట్స్మన్ రికీ భుయ్ని అనుకోని అదృష్టం తలుపుతట్టింది. అతను భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ జూనియర్ జట్టు శ్రీలంకలో పర్యటించేందుకు శనివారం అక్కడికి బయల్దేరుతుంది. ఇంతకుముందు ప్రకటించిన జట్టులో ఆంధ్ర కుర్రాడు కేవలం వన్డే జట్టుకే ఎంపికయ్యాడు.
అయితే గుజరాత్ ఆటగాడు కరణ్ విరాడియా వయసు మీరడంతో అతన్ని తప్పించి భుయ్ని నాలుగు రోజుల మ్యాచ్లకూ ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. కరణ్ తమకు సమర్పించిన వయసు ధ్రువీకరణ పత్రంలోని తేది, పాస్పోర్ట్లో నమోదైన తేదీ భిన్నంగా ఉండటంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. విజయ్ జోల్ నేతృత్వంలోని యువ భారత జట్టు 2 నాలుగు రోజుల మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడుతుంది.