క్వార్టర్స్‌లో సౌరభ్‌ వర్మ

9 Aug, 2019 04:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల విభాగంలో ఐదో సీడ్‌ శుభాంకర్‌ డే, ఏడో సీడ్‌ సౌరభ్‌ వర్మ, అజయ్‌ జయరామ్‌ క్వార్టర్స్‌కు చేరుకోగా... మహిళల సింగిల్స్‌ కేటగిరీలో ఆకర్షి కశ్యప్, చుక్కా సాయి ఉత్తేజితరావు పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో శుభాంకర్‌ డే 21–16, 21–15తో చికో అరా వార్డొయో (ఇండోనేసియా)పై గెలుపొందగా... సౌరభ్‌ వర్మ 21–16, 21–11తో సన్‌ పెయ్‌ జియాంగ్‌ (చైనా)ను, అజయ్‌ జయరామ్‌ 21–18, 21–13తో జియా వీ తాన్‌ (మలేసియా)ను ఓడించారు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ పారుపల్లి కశ్యప్‌ 21–17, 15–21, 19–21తో లోహ్‌ కియాన్‌ యు (సింగపూర్‌) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజిత రావు 10–21, 21–9, 8–21తో క్వాలిఫయర్‌ బెన్‌యప ఎమ్‌సార్డ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, క్వాలిఫయర్‌ ఆకర్షి కశ్యప్‌ 18–21, 13–21తో రెండో సీడ్‌ అన్‌ సు యంగ్‌ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది.    

మరిన్ని వార్తలు