‘వారు సైనిక హీరోల కుమారులు’

18 Oct, 2019 15:35 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీటర్‌ అకౌంట్‌లో ఎప్పుడూ యాక్టివ్‌ ఉంటాడు. అయితే తాజాగా వీరూ చేసిన ట్వీట్‌కు మాత్రం నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. వారిలో కొందరి పిల్లలను సెహ్వాగ్‌ తన అంతర్జాతీయ స్కూల్లోనే చదివిస్తున్నాడు. ఈ సందర్భంగా వారు క్రికెట్‌లో శిక్షణ పొందుతున్న ఫొటోలను ట్వీట్‌ చేశాడు. ‘వారంతా సైనిక హీరోల కుమారులు. ముఖ్యంగా ఆ ఇద్దరు ఇక్కడ ఉండడం గౌరవంగా భావిస్తున్నాను.

బ్యాటింగ్‌ చేస్తున్న కుర్రాడు అమర జవాన్‌ రామ్‌ వకీల్‌ కుమారుడు.. బౌలింగ్‌ చేస్తున్న కుర్రాడు అమర జవాన్‌ విజయ్‌ సోరెంగ్‌ కుమారుడు. వీరికి సేవ చేయడం కన్నా మించిన ఆనందం ఉంటుందా’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. దీనిపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానులు సెహ్వాగ్‌కు సెల్యూట్‌ చేస్తున్నారు. అమరులైన జవాన్ల పిల్లల్ని చదివించి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నావ్‌ అంటూ కొనియాడుతున్నారు. విద్యాదానం కంటే మరేది గొప్పది కాదు అంటూ సెహ్వాగ్‌ను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు