న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితితో భారత్పై విద్వేషం వెళ్లగక్కిన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్కు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వగా ఇప్పుడు ఆ జాబితాలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా చేరిపోయాడు. ‘ వీరూ.. ఆ వీడియోను చూసి షాక్ గురయ్యాను. అది వినకూడని ప్రసంగం. ప్రపంచం మొత్తం శాంతిని కోరుకుంటుంటే పాకిస్తాన్కు అందుకు భిన్నంగా స్పందించింది. అసలు శాంతి అనేది పాకిస్తాన్కు చాలా అవసరం. ఆ దేశానికి ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఇలా మాట్లాడతారనుకోలేదు. అదొక చెత్త స్పీచ్. ఇప్పుడు ఇమ్రాన్ ఒక క్రికెటర్గానే ప్రపంచానికి తెలియలేదు.. ఐక్యరాజ్యసమితిలో ఒక పేలవమైన ప్రసంగం చేసి మరీ తెలిశారు’ అంటూ గంగూలీ పేర్కొన్నాడు.
అంతకుముందు సెహ్వాగ్ తన ట్వీటర్ అకౌంట్లో ఇమ్రాన్ తీరును విమర్శించారు. తనను కించపరుచుకునేందుకు కొత్త మార్గాలు కనిపెట్టారంటూ ఇమ్రాన్ఖాన్పై ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇమ్రాన్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి సెటైర్ వేశాడు. గత నెల 26 జరిగిన ఐరాస సాధారణ సభ 74వ సమావేశాల్లో ఇమ్రాన్ఖాన్ మాట్లాడుతూ.. భారత్తో యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.