సవాల్‌ను ఎదుర్కొంటాం!

30 Sep, 2019 02:43 IST|Sakshi

దక్షిణాఫ్రికా పేసర్‌ ఫిలాండర్‌

విజయనగరం: భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌పైనే తామంతా దృష్టిపెట్టామని...ప్రత్యర్థితో ముఖాముఖి సవాళ్లను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నాడు దక్షిణాఫ్రికా పేసర్‌ వెర్నాన్‌ ఫిలాండర్‌. దిగ్గజ క్రికెటర్లు హషీమ్‌ ఆమ్లా, డేల్‌ స్టెయిన్‌ రిటైర్మెంట్‌ అనంతరం తొలిసారిగా టెస్టు సిరీస్‌ ఆడబోతున్న సఫారీలు... దీంతో పాటే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియాతో సిరీస్‌ కఠినమైనదని పేర్కొంటూనే జట్టులోని సీనియర్లు రాణించి ప్రత్యర్థికి షాకివ్వాలని ఫిలాండర్‌ అన్నాడు.

‘తమదైన ముద్ర చూపేలా ఇప్పుడు సీనియర్లపై పెద్ద బాధ్యత ఉంది. దానిని నిర్వర్తించడమే మా విధి. మేం విజయాల వేటను ఆలస్యంగా ప్రారంభిస్తామన్న పేరుంది. ఈసారి మాత్రం మెరుగ్గా మొదలుపెట్టాలి. ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉన్నది వాస్తవమే. రాబోయే సిరీస్‌లో జూనియర్లు త్వరగా నేర్చుకోవాలి. సీనియర్లు వారికి మార్గదర్శకంగా నిలిచి భవిష్యత్‌లో మంచి జట్టుగా ఎదిగేందుకు మార్గం చూపాలి’ అని అతడు పేర్కొన్నాడు. ఫిలాండర్‌ గతేడాది మొదట్లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత్‌ను తన పేస్‌తో దెబ్బకొట్టాడు. మూడు టెస్టుల్లో 15 వికెట్లు తీశాడు.    

మరిన్ని వార్తలు