వారెవ్వా... మెండిస్, మాథ్యూస్‌

19 Dec, 2018 01:36 IST|Sakshi

వికెట్‌ ఇవ్వకుండా రోజంతా బ్యాటింగ్‌

వీరోచిత సెంచరీలతో అబేధ్యమైన భాగస్వామ్యం

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు  

వెల్లింగ్టన్‌: కివీస్‌ పర్యటనలో అదరహో అనే బ్యాటింగ్‌తో శ్రీలంక వార్తలకెక్కింది. కుశాల్‌ మెండిస్‌ (287 బంతుల్లో 116 బ్యాటింగ్‌; 12 ఫోర్లు), మాథ్యూస్‌ (293 బంతుల్లో 117 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) ఔరా అనిపించారు. ఘోరంగా ఓడుతుందనుకున్న టెస్టులో ఇద్దరు అజేయ శతకాలతో వీరోచిత పోరాటం చేశారు. వికెట్‌ ఇవ్వకుండా నాలుగో రోజంతా బ్యాటింగ్‌ చేశారు. ఆట నిలిచే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. కేవలం 37 పరుగులే వెనుకబడింది. కివీస్‌ ఆధిక్యం 296 పరుగులు. దీంతో పొంచి ఉన్న ఇన్నింగ్స్‌ పరాజయంతో నాలుగో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 20/3తో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మెండిస్, మాథ్యూస్‌ క్రీజులో ఉన్నారు. ఏ రకంగా చూసిన నాలుగో రోజే ఆతిథ్య న్యూజిలాండ్‌ గెలవాల్సిన మ్యాచ్‌. కానీ ఇద్దరు క్రీజులో పాతుకుపోయారు. సమన్వయంతో మూడు సెషన్లను పూర్తిగా ఆడారు. మూడో సెషన్‌ మొదలైన తర్వాత ముందుగా మెండిస్‌ సెంచరీ పూర్తి చేసుకోగా... ఆ తర్వాత మాథ్యూస్‌ శతక మార్కు అందుకున్నాడు. వీళ్లిద్దరు అబేధ్యమైన నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 246 పరుగులు జోడించడం విశేషం. 

►1 సొంత గడ్డపై రోజంతా  ఆడినా న్యూజిలాండ్‌  ఒక్క వికెటైనా తీయలేకపోవడం  ఇదే మొదటిసారి. 

►10 పదేళ్ల తర్వాత టెస్టుల్లో మళ్లీ  ఈ ఘనత సాధ్యమైంది. 2008లో బంగ్లాదేశ్‌లో దక్షిణాఫ్రికా ఒక్క వికెట్‌ కోల్పోకుండా రోజంతా బ్యాటింగ్‌ చేసింది. 

► 22 ఓవరాల్‌గా టెస్టు చరిత్రలోనే ఇలా వికెట్‌ లేకుండా రోజు ముగియడం  22వ సారి మాత్రమే.   

మరిన్ని వార్తలు