టాటా ఓపెన్‌ విజేత సిమోన్‌

7 Jan, 2018 01:31 IST|Sakshi

పుణే: మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఫ్రాన్స్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ గైల్స్‌ సిమోన్‌ కెరీర్‌లో మరో టైటిల్‌ను గెలిచాడు. భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్‌లో సిమోన్‌ పురుషుల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సిమోన్‌ ఫైనల్లో 7–6 (7/4), 6–2తో ప్రపంచ 14వ ర్యాంకర్‌ కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. విజేతగా నిలిచిన సిమోన్‌కు 89,435 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 56 లక్షల 65 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

ఒకప్పుడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న సిమోన్‌ ఈ టోర్నీలో అద్భుత ఆటతీరును కనబరిచాడు. రెండో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్, మూడో సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌)పై గెలిచిన అతను... సెమీఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, టాప్‌ సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)ను మట్టికరిపించాడు. చివరిసారి సిమోన్‌ 2015 ఫిబ్రవరిలో మార్సెలి ఓపెన్‌ టైటిల్‌ను సాధించాడు. మరోవైపు డబుల్స్‌ ఫైనల్లో రాబిన్‌ హాస్‌–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జంట 7–6 (7/5), 7–6 (7/5)తో సిమోన్‌–హెర్బర్ట్‌ (ఫ్రాన్స్‌) జోడీని ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది.    

మరిన్ని వార్తలు