విండీస్‌ను టీమిండియా కట్టడి చేస్తుందా?

15 Dec, 2019 17:52 IST|Sakshi

చెన్నై: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 288 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. భారత ఆటగాళ్లలో శ్రేయస్‌ అయ్యర్‌(70; 88 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌(71; 69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌)లు హాఫ్‌ సెంచరీలు సాధించడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరును విండీస్‌ ముందుంచింది. వీరికి జతగా కేదార్‌ జాదవ్‌(40; 35 బంతుల్లో 3 పోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకోగా, రోహిత్‌ శర్మ(36; 56 బంతుల్లో 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. దాంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌, జోసెఫ్‌, కీమో పాల్‌లు తలో రెండు వికెట్లు సాధించగా పొలార్డ్‌ వికెట్‌ తీశాడు.(ఇక్కడ చదవండి: అయ్యర్‌ మళ్లీ కొట్టేస్తే.. పంత్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు)

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ ముందుగా ఫీల్డింగ్‌  ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్‌కు  దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. తొలి వికెట్‌గా కేఎల్‌ రాహుల్‌(6) ఔట్‌ కాగా, రెండో వికెట్‌గా విరాట్‌ కోహ్లి(4) పెవిలియన్‌ చేరాడు. ఈ రెండు వికెట్లను విండీస్‌ పేసర్‌ కాట్రెల్‌ సాధించి టీమిండియాకు షాకిచ్చాడు.  ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ రెండో బంతికి రాహుల్‌ను ఔట్‌ చేసిన కాట్రెల్‌.. ఆ ఓవర్‌ చివరి బంతికి కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. హెట్‌మెయిర్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌ ఔట్‌ కాగా, కోహ్లి వికెట్ల మీదుగా బంతిని ఆడి బౌల్డ్‌ అయ్యాడు. ఆ తరుణంలో రోహిత్‌-అయ్యర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను సాఫీగా ముందుకు తీసుకెళ్లింది. అటు తర్వాత అయ్యర్‌-పంత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది.  (ఇక్కడ చదవండి:అయ్యో పంత్‌.. మళ్లీ అదే షాట్‌.. అదే ఔట్‌)

రోహిత్‌-అయ్యర్‌లు 55 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించగా, అయ్యర్‌-పంత్‌ల జోడి 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. శ్రేయస్‌ అయ్యర్‌(70) సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న పొలార్డ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై పంత్‌  డీప్‌ బ్యాక్‌వర్డ్‌స్వేర్‌ లెగ్‌ మీదుగా భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. ఇక జాదవ్‌ ఒకవైపు బ్యాట్‌ ఝుళిపిస్తూనే మరొకవైపు స్టైక్‌ రొటేట్‌ చేశాడు. రవీంద్ర జడేజా(21)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 59 పరుగులు జోడించిన తర్వాత జాదవ్‌ ఆరో వికెట్‌గా ఔట్‌ కాగా, కాసేపటికి జడేజా రనౌట్‌ అయ్యాడు. చివరి ఓవర్‌లో శివం దూబే(9) భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. మరొకవైపు ఆఖరి ఓవర్‌లో భారత్‌  9 పరుగులు మాత్రమే సాధించింది. తన 288 పరుగుల టార్గెట్‌ను టీమిండియా కాపాడుకుంటుందా.. లేక విండీస్‌ ఛేదిస్తుందా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు