తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌

3 Nov, 2023 13:17 IST|Sakshi

టీమిండియా క్రికెటర్లు రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌ ఇవాళ (నవంబర్‌ 3) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వీరు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన పంత్, అక్షర్‌లతో ఫొటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. టీటీడీ సిబ్బంది సైతం ఈ ఇద్దరితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. 

కాగా, గాయాల కారణంగా పంత్‌, అక్షర్‌లు ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది చివర్లో కార్‌ యాక్సిడెంట్‌కు గురైన పంత్‌ పూర్తిగా కోలుకునే క్రమంలో ఉండగా.. అక్షర్‌ ఇటీవలే వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యాక గాయపడ్డాడు. అక్షర్‌ స్థానంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ టీమిండియాకు ఎంపికయ్యాడు.

ఇదిలా ఉంటే, 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ఎడిషన్‌లో భారత్‌ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఏడింట విజయాలు సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. నిన్ననే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ రికార్డు స్థాయిలో 302 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ఎడిషన్‌లో భారత్‌ లీగ్‌ దశలో ఇంకా రెండు మ్యాచ్‌లు (సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌) ఆడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు