బుమ్రా మెరిసె.. కోహ్లి మురిసె

10 Mar, 2019 19:12 IST|Sakshi

మొహాలి: ఆస్ట్రేలియాతో నాల్గో వన్డేలో టీమిండియా ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్ శర్మలు విజృంభించి ఆడారు. ఇక్కడ శిఖర్‌ ధావన్‌ భారీ సెంచరీ చేయగా, రోహిత్‌ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ 193 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం సాధించారు. అయితే ధావన్‌-రోహిత్‌ల ఇన్నింగ్స్‌ ఒక ఎత్తైతే, చివరి ఓవర్‌ ఆఖరి బంతికి బుమ్రా సిక్స్‌ కొట్టడం మరొక ఎత్తు.

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన పాట్ కమిన్స్ బౌలింగ్‌లో తొలి బంతిని సిక్స్‌‌గా మలిచిన విజయ్ శంకర్ మూడో బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన చహల్ ఐదో బంతికి ఔటవ్వగా చివరి వికెట్‌గా  బుమ్రా క్రీజులోకి వచ్చాడు. అప్పటికే ఐదు వికెట్లు పడగొట్టిన కమిన్స్.. బుమ్రాని ఔట్ చేస్తాడు లేదా కనీసం బంతిని డాట్ చేస్తాడని అంతా భావించారు. కానీ.. బుమ్రా అందరి అంచనాల్ని తలకిందులు చేశాడు. ఆ బంతిని కళ్లుచెదిరే రీతిలో లాంగాన్ దిశగా సిక్స్‌గా మలిచాడు. బుమ్రా షాట్‌కి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం ఆనందంతో తెగ మురిసిపోయాడు. దీనికి సంబంధించి వీడియోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. తన కెరీర్‌లో ఇప్పటి వరకూ 48 వన్డేలాడిన బుమ్రాకి ఇదే తొలి సిక్స్ కావడం కొసమెరుపు.

ఇక్కడ చదవండి: మరో ‘సెంచరీ’ కొట్టేశారు..!

ఆసీస్‌పై సరికొత్త రికార్డు

మరిన్ని వార్తలు