విష్ణువర్ధన్‌ గౌడ్‌ ‘డబుల్‌’

19 Dec, 2017 00:29 IST|Sakshi

జాతీయ జూ. బ్యాడ్మింటన్‌ టోర్నీ

గువాహటి: జాతీయస్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు తమ సత్తా చాటుకున్నారు. సోమవారం ముగిసిన జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో డబుల్స్‌ విభాగాల్లో పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌ (తెలంగాణ) రెండు టైటిల్స్‌... గారగ కృష్ణ ప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌) ఒక టైటిల్‌ గెలుపొందారు. అండర్‌–19 బాలుర డబుల్స్‌ ఫైనల్లో విష్ణువర్ధన్‌ గౌడ్‌–పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్‌ (తెలంగాణ) జంట 21–16, 21–19తో సంజయ్‌ శ్రీవత్స (పాండిచ్చేరి)–సిద్ధార్థ్‌ ఎలాంగో (తెలంగాణ) జోడీపై... అండర్‌–17 బాలుర డబుల్స్‌ ఫైనల్లో విష్ణువర్ధన్‌ గౌడ్‌–బొక్కా నవనీత్‌ (తెలంగాణ) ద్వయం 21–14, 21–13తో ధ్రువ్‌ రావత్‌ (ఉత్తరాఖండ్‌)–ఆకాశ్‌ యాదవ్‌ (ఢిల్లీ) జంటపై విజయం సాధించింది.

అండర్‌–19 మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో గారగ కృష్ణప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌)–మిథుల (ఎయిరిండియా) జోడీ 21–18, 21–18తో పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్‌ (తెలంగాణ)–రితూపర్ణ (ఒడిశా) ద్వయంపై గెలిచింది. అండర్‌–17 బాలికల డబుల్స్‌ ఫైనల్లో కేయూర మోపాటి–కవిప్రియ (తెలంగాణ) జంట 21–19, 15–21, 20–22తో త్రిషా హెగ్డే–ధ్రితి యతీశ్‌ (కర్ణాటక) జోడీ చేతిలో ఓడింది.    

మరిన్ని వార్తలు