బీసీసీఐపై భగ్గుమన్న కోహ్లి.. వరుస సిరీస్‌లపై ఆగ్రహం!

23 Nov, 2017 15:21 IST|Sakshi

నాగ్‌పూర్‌: ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా వరుస క్రికెట్‌ సిరీస్‌లు నిర్వహిస్తున్న భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) తీరుపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుస సిరీస్‌లు నిర్వహించేటప్పడు ఆటగాళ్ల కోణంలో సైతం ఆలోచించాలని బీసీసీఐకి హితవు పలికారు. గత్యంతరం లేకనే వరుస సిరీస్‌లు ఆడాల్సి వస్తుందని బీసీసీఐకి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంకతో రేపటి నుంచి నాగ్‌పూర్‌లో రెండో టెస్టు ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ ముగిసిన వెంటనే టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో గురువారం నాగ్‌పూర్‌లో కోహ్లి విలేకరులతో మాట్లాడారు. 

‘ఈ సిరీస్‌ ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు మాకు రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నది. మాకు గేమ్‌లో ఉండటం తప్ప మరో గత్యంతరం లేదు. మాకు ఒక నెల గడువు దొరికినట్టయితే.. మేం సరిగ్గా ఈ పర్యటనకు సన్నద్ధమై ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు మాకు ఇచ్చిన సమయంలోనే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని కోహ్లి అసహనం వ్యక్తం చేశారు.

‘మేం సమయం కోసం అల్లాడిల్సిన పరిస్థితి నెలకొంది. సహజంగా విదేశీ పర్యటనలు అంటే జట్టు తగినంతగా సన్నద్ధం కావడానికి సమయం ఇస్తారు. కానీ ఇప్పుడు మాకు ప్రిపరేషన్‌ కోసం ఎన్ని రోజులు ఉన్నాయో తెలియని పరిస్థితి’ అని కోహ్లి అన్నారు.
 

మరిన్ని వార్తలు