రూ.500 కొట్టు మఫ్లర్‌మ్యాన్‌తో సెల్ఫీ పట్టు

22 Dec, 2014 02:14 IST|Sakshi
రూ.500 కొట్టు మఫ్లర్‌మ్యాన్‌తో సెల్ఫీ పట్టు

పార్టీ నిధుల సేకరణకు అమ్ ఆద్మీ వినూత్న పంథా
 
 
బెంగళూరు:  అమ్ ఆద్మీ పార్టీ నిధుల సేకరణకు వినూత్న పంథా అనుసరించనుంది. ఆ పార్టీ కర్ణాటక శాఖ జనవరి 11న ‘సెల్ఫీ విత్ మఫ్లర్ మ్యాన్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో విరాళాల రూపంలో రూ.500 ఆ పై ఎక్కువ నిధులను పార్టీకి అందించిన వారిలో 25 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి అరవింద్ కేజ్రీవాల్‌తో సెల్ఫీ తీయించుకునే అవకాశం కల్పించనున్నారు. ఒకరు రూ.500 కంటే ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ఇస్తే సదరు వ్యక్తి పేరును డ్రా తీయడానికి ముందు ఒకటి కంటే ఎక్కువ సార్లు చేరుస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.2,000 విరాళంగా అందిస్తే అతని పేరును నాలుగుసార్లు (రూ.500గీ4) డ్రాలో చేరుస్తారు. విరాళాలు అందజేయడం, డ్రా తీయడం విధానం అంతా ఆన్‌లైన్‌లో జరగనుంది..

విరాళాలు అందించడానికి వచ్చే నెల7 వరకూ అవకాశం ఉంటుంది. ఈ విధంగా సమకూరిన నిధులను  పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా త్వరలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకు ఎక్కువ నిధులు కర్ణాటక నుంచే సమకూరిన విషయం గమనార్హం.  కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ రోజున కేజ్రీవాల్ బెంగళూరుకు వస్తారు.  

ఇదిలా ఉండగా కేజ్రీవాల్ ఎక్కువ సమయం మెడలో మఫ్లర్‌తో కనిపిస్తూ ఉండటం, ప్రజ లకు త్వరగా విషయాన్ని చేర్చడానికి వీలుగా సెఫ్లీ విత్ మఫ్లర్‌మ్యాన్ అనే పేరును ఆ పార్టీ నాయకులు సూచించారు. మరోవైపు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పాల్గొనే విషయంపై కూడా అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కర్ణాటక శాఖ నాయకులతో చర్చించే అవకాశం ఉంది.  
 
 

మరిన్ని వార్తలు