'బాబును చూస్తే వర్షం కూడా రాదు'

21 Apr, 2017 15:57 IST|Sakshi
'బాబును చూస్తే వర్షం కూడా రాదు'
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి రైతులంటే చిన్నచూపు అని అందుకే రైతులను అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి కాంగ్రెస్‌ నేత శైలజానాథ్‌ విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. బాబు ను చూస్తే వర్షం కూడా రాదనేది నిజమని పేర్కొన్నారు. రైతుల పట్ల బాబు అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అనంతపురం జిల్లా పెద్ద కొడుకని చెప్పిన బాబు.. అక్కడి ప్రజల కంట్లో మట్టి కొట్టి పొయ్యారని తీవ్రంగా విమర్శించారు. అనంతపురంపై నిజంగా ప్రేమ ఉంటే హంద్రీనీవా నుంచి జిల్లాలోని అన్ని చెరువులు నింపాలని డిమాండ్‌ చేశారు. 
 
ఏపీలో అసమర్ధ పాలన కొనసాగుతోందని అన్నారు. పోలవరాన్ని 2018లో పూర్తి చేస్తానని చెప్పి...ఇప్పుడు 2019 అంటూ మాట మార్చారని దుయ్యబట్టారు. ఉపాధి హామీ పధకాన్ని భ్రష్టు పట్టించారని.. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం అప్పు పడిందని.. ఇది మీకు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. కూలీ డబ్బులు ఇవ్వకపోతే.. పేదవారు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. వెంటనే కూలి డబ్బులు ఇచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు.
మరిన్ని వార్తలు